||సుందరకాండ ||

||ఇరువది తొమ్మిదవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 30 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ త్రింశస్సర్గః

శ్లో||హనుమానపి విక్రాంతః సర్వం శుశ్రావ తత్త్వతః|
సీతాయాః త్రిజటాయాశ్చ రాక్షసీనాం తర్జనమ్||1||
అవేక్షమాణ స్తాం దేవీం దేవతామివ నందనే|
తతో బహువిధాం చింతాం చింతయామాస వానరః||2||

స||విక్రాంతః హనుమాన్ తత్త్వతః రాక్షసీనాం సీతాయాః తర్జనమ్ త్రిజటాయాశ్చ్ అపి సర్వం శుశ్రావ|| తాందేవీం నందనే దేవతాం ఇవ అవేక్షమాణా వానరః తతః బహువిధాం చింతయామాస||

తా|| పరాక్రమవంతుడైన హనుమంతుడు రాక్షసస్త్రీలచేత సీత భయపెట్టబడడము , త్రిజట స్వప్న వృత్తాంతము అన్నీ యథాతథముగా వినెను. నందనవనములోని దేవతవలె నున్న ఆ సీతను చూచి ఆ వానరుడు పరిపరివిధములగా ఆలోచించసాగెను.

శ్లో||యాం కపీనాం సహస్రాణి సుబహూన్యయుతాని చ|
దిక్షు సర్వాసు మార్గంతే సేయ మాసాదితా మయా||3||
చారేణ తు సుయుక్తేన శత్రో శ్శక్తి మవేక్షతా|
గూఢేన చరతా తావత్ అవేక్షిత మిదం మయా||4||

స|| కపీనాం సుబహూని సహస్రాణి అయుతాని చ సర్వాసు దిక్షు యాం మార్గంతే సా ఇయం మయా ఆసాదితా || సుయుక్తేన శత్రోః శక్తిం అవేక్షతా గూఢేన చరతా చారేణ మయా ఇదం అవేక్షితం తావత్ ||

తా|| ' ఏ సీత కొరకై వందలకొలదీ వేలకొలదీ వానరులు అన్ని దిశలలో వెదుకుతున్నరో అట్టి సీతను నేను చూచితిని. గుఢచారిలాగ తిరుగుతూ యుక్తితో శత్రువుల శక్తిని చూచి ఇది అంతా అవగాహన చేసుకున్నాను'.

శ్లో||రాక్షసానాం విశేషశ్చ పురీచేయమవేక్షితా|
రాక్షసాధిపతేరస్య ప్రభావో రావణస్య చ||5||
యుక్తం తస్యాsప్రమేయస్య సర్వ సత్త్వ దయావతః|
సమశ్వాసయితుం భార్యాం పతిదర్శన కాంక్షిణీమ్||6||

స|| రాక్షసానాం విశేషః చ అయం పురీ చ అస్య రాక్షసాధిపతేః రావణస్య ప్రభావః చ అవేక్షితా|| సర్వసత్త్వ దయావతః అప్రమేయస్య తస్య పతిదర్శనకాంక్షిణీం భార్యాం సమశ్వాసయితుం యుక్తం||

తా|| 'రాక్షసులగురించి, విశేషముగా ఈ నగరముగురించి, ఈ రాక్షసాధిపతి రావణునియొక్క ప్రభావము కూడా చూచితిని. అన్ని ప్రాణులపై దయకలవాడు , అప్రమేయుడు అయిన అ పతి దర్శనము కోరుకొనుచున్న ఈ భార్యను ఊరడించడము యుక్తము'.

శ్లో||అహమాశ్వాసయా మ్యేనాం పూర్ణచంద్రనిభాననాం|
అదృష్టదుఃఖాం దుఃఖార్తాం దుఃఖ స్యాంత మగచ్ఛతీమ్||7||
యద్యప్యహం ఇమాం దేవీం శోకోపహతచేతసాం|
అనాశ్వాస్య గమిష్యామి దోషవత్ గమనం భవేత్||8||
గతేహి మయి తత్రేయం రాజపుత్రీ యశస్వినీ|
పరిత్రాణ మవిందంతీ జానకీ జీవితం త్యజేత్||9||

స|| ఏనాం పూర్ణచంద్రనిభాననాం అదృష్టదుఃఖాం దుఃఖార్తాం దుఃఖఃస్య అంతం అగచ్ఛతీం అహం అశ్వాసయామి ||యది శోకోపహతచేతసాం ఇమాం దేవీం అనాశ్వాస్య గమిష్యామి (తత్) దోషవత్ గమనం భవేత్|| మయి తత్ర గతే యశస్వినీ రాజపుత్రీ జానకీ పరిత్రాణమ్ అవిందంతీ జీవితం త్యజేత్||

తా|| 'ఈ పూర్ణచంద్రుని బోలు ముఖము కల , ఎప్పుడూ దుఃఖములను ఎరుగని , ఇప్పుడు దుఃఖముల అంతము కానరాక అతి దుఃఖములో నున్న ఆమెకి ఆశ్వాసమిచ్చెదను. ఒకవేళ దుఃఖములో మునిగిఉన్న ఆ దేవికి ఆశ్వాసమివ్వకుండా వెళ్ళిపోయినచో అది పొరపాటు అవును. నేను అలా వెళ్ళిపోతే యశస్వినీ అగు రాజపుత్రి జానకి తనకు రక్షింపబడు మార్గము కానరాక జీవితమే త్యజించును'.

శ్లో||మయా చ స మహాబాహుః పూర్ణచంద్ర నిభాననః|
సమశ్వాసయితుం న్యాయ్యః సీతాదర్శనలాలసః||10||
నిశాచరీణాం ప్రత్యక్షం అనర్హం చాపి భాషణమ్|
కథం ను ఖలు కర్త్వవ్యం ఇదం కృచ్ఛగతో హ్యహమ్||11||
అనేన రాత్రి శేషేణ యది నాశ్వాస్యతే మయా|
సర్వథా నాస్తి సందేహః పరిత్యక్షతి జీవితమ్||12||

స|| పూర్ణచంద్రనిభాననః మహాబాహుః సీతాదర్శన లాలసః మయా సమశ్వాసయితుం న్యాయ్యః || నిశాచరీణాం ప్రత్యక్షం భాషణం చ అనర్హం అపి | కథం ను కర్తవ్యం ను | అహం కృఛ్ఛగతో హి || యది అనేన రాత్రిశేషేణ న ఆశ్వాస్యతే సా సర్వథా జీవితం పరితక్ష్యతి | సందేహః న అస్తి||

తా|| ' పూర్ణచంద్రునిబోలిన మహాబాహువులు కల సీతను చూచుటకు తహతహలాడుతున్న రామునకు ఉపశమనము కలిగించుట న్యాయము. ఈ నిశాచరుల ముందర సంభాషణ మంచిదికాదు. ఏమిటి నా కర్తవ్యము?. నాకు ఏమీ తోచకున్నది. ఈ రాత్రి ఆమెకు ఆశ్వాసన ఇవ్వకపోతే ఆమె జీవితమును పరిత్యజించును.ఇందులో సందేహము లేదు.

శ్లో||రామశ్చ యది పృచ్ఛేన్మాం కిం మాం సీతాsబ్రవీత్ వచః|
కిం అహం తం ప్రతిబ్రూయాం అసంభాష్య సుమధ్యమామ్||13||
సీతా సందేశరహితం మాం ఇతః త్వరయా గతమ్|
నిర్దహే దపి కాకుత్‍స్థః క్రుద్ధః తీవ్రేణ చక్షుషా ||14||
యది చో ద్యోజయిష్యామి భర్తారం రామ కారణాత్|
వ్యర్థమాగమనం తస్య ససైన్యస్య భవిష్యతి||15||

స|| యది రామః మాం పృచ్ఛే కిం మాం సీతా అబ్రవీత్ వచః తదా సుమధ్యమామ్ అసంభాష్య అహమ్ తం కిం ప్రతిబ్రూయామ్|| సీతా సందేశరహితం ఇతః త్వరయా గతం మాం కాకుత్‍స్థః క్రుద్ధః తీవ్రేణ చక్షుషా నిర్దహేత్ అపి|| రామకారణాత్ భర్తారం యది చ ఉద్యోజయిష్యామి ససైన్యస్య తస్య ఆగమనం వ్యర్థం భవిష్యతి ( యది సీతా జీవితం త్యజేత్)||

తా|| 'ఒకవేళ రాముడు నన్ను "నాకు సీతా ఏమి చెప్పినది" అని అడిగినచో ఆ సందరాంగితో మాట్లాడకూండా ఏమి సమాధానమిచ్చెదను. సీతాసందేశము లేకుండా ఇక్కడనుంచి త్వరగా వెళ్ళిన నన్ను ఆ కాకుత్‍స్థుడు తీవ్రమైన కన్నులతో దహించివేయును. రాముని కార్యము నెరవేర్చుటకు సుగ్రీవుని సైన్యముతో కూడా తీసుకువచ్చినచో ఆ పని కూడా వ్యర్థమగును.

శ్లో||అంతరం త్వహమాసాద్య రాక్షసీనామిహ స్థితః|
శనైరాశ్వాసయిష్యామి సంతాప బహుళామిమామ్||16||
అహం త్వతితనుశ్చైవ వానరశ్చ విశేషతః|
వాచం చో దాహరిష్యామి మానుషీ మిహ సంస్కృతామ్||17||

స|| అహం ఇహ స్థితః రాక్షసీనామ్ అంతరం అసాద్య సంతాపబహుళాం ఇమాం శనైః ఆశ్వాసయిష్యామి || అహం తు అతితనుశ్చ | విశేషతః వానరః చ | ఇహ సంస్కృతాం మానుషీం వాచం చ ఉదాహిరిష్యామి |

తా|| నేను ఇక్కడ కూర్చుని రాక్షసుల అంతరాయములేకుండా సంతాపములో మునిగియున్న ఈమెకు మెల్లిగా ఆశ్వాసమిచ్చెదను. నేను సూక్ష్మరూపములో ఉన్నవాడిని. అందులోనూ వానరుడను. ఇప్పుడు సంస్కారముకల మనుష్యుల భాషలో మాట్లాడెదను.

శ్లో||యది వాచం ప్రదాస్యామి ద్విజాతి రివ సంస్కృతామ్|
రావణం మన్యమానా మాం సీతా భీతా భవిష్యతి||18||
వానరస్య విశేషేణ కథం స్యాదభిభాషణమ్|
అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్య మర్థవత్||19||
మయా సాంత్వయితుం శక్యా నాన్యథేయ మనిందితా|

స|| యది ద్విజాతిః ఇవ సంస్కృతాం వాచం ప్రదాశ్యామి మాం రావణం మన్యమానా సీతా భీతా భవిష్యతి | విశేషేణ వానరస్య అభిభాషణం కథం ను || ఏవం అవశ్యమ్ అర్థవత్ మానుషం వాక్యం వక్తవ్యం|అన్యథా ఇయం అనిందితా సాంత్వయితుం మయా న శక్యా ||

తా|| 'నేను ద్విజులుమాట్లాడే సంస్కృతములో మాట్లాడినచో నన్ను రావణుడా అనే శంకతో సీత భయపడును. ప్రత్యేకముగా వానరుడు ఇట్లు ఎలామాట్లాడునూ అని. అందువలన అవశ్యముగా మనుష్యులభాషలో అర్థవంతముగా మాట్లాడవలెను. లేకపోతే ఈమెను శాంతపరచుట సంభవము కాదు".

శ్లో||సేయ మాలోక్య మే రూపం జానకీ భాషితం తథా||20||
రక్షోభి స్త్రాసితా పూర్వం భూయ స్త్రాసం గమిష్యతి|
తతో జాత పరిత్రాసా శబ్దం కుర్యాన్ మనస్వినీ||21||
జానమానా విశాలాక్షీ రావణం కామరూపిణమ్|

స|| |పూర్వం రక్షోభిః త్రాసితా సా ఇయం జానకి మే రూపం ఆలోక్య భాషితమ్ తథా భూయః త్రాసం గమిష్యతి || తతః మనస్వినీ విశాలాక్షీ మాం కామరూపిణం రావణం జానమానా జాతపరిత్రాసా శబ్దం కుర్వన్ ||

తా|| ' ముందే రాక్షసులతో భయపడిన ఈ సీత నా రూపము భాష చూచి మళ్ళీ భయపడును. అప్పుడు ఆ మనస్విని నన్ను కామరూపుడగు రావణుడు అని భావించి పెద్ద శబ్దము చేయును'.

శ్లో||సీతాయా చ కృతే శబ్దే సహసా రాక్షసీ గణాః||22||
నానాప్రహరణో ఘోరః సమేయాదంతకోపమః|
తతో మాం సంపరిక్షిప్య సర్వతో వికృతాననాః||23||
వధే చ గ్రహణే చైవ కుర్యుర్యత్నం యథాబలమ్|

స|| సీతయాః కృతే శబ్దే రాక్షసీ గణాః నానాప్రహరణః ఘోరః అంతకోపమః సమేయాత్ || తతః వికృతాననః మాం సర్వతః సంపరిక్షిప్య వధే చ గ్రహణే చ యథాబలం యత్నం కుర్యుః||

తా|| ' సీత చేత చేయబడిన శబ్దముతో యమునిలా భయంకరముగా వున్న రాక్షసీ గణములు గుమిగూడెదరు. అప్పుడు ఆ వికృతాననలు చుట్టుముట్టి నన్ను బంధించుటకు కాని వధించుటకు గాని ప్రయత్నము చేసెదరు'.

శ్లో||గృహ్య శాఖాః ప్రశాఖాశ్చ స్కంధాం శ్చోత్తమశాఖినామ్||24||
దృష్ట్వా విపరిధావంతం భవేయుర్భయశంకితాః|
మమ రూపం చ సంప్రేక్ష్య వనే విచరతో మహత్||25||
రాక్షస్యో భయవిత్రస్తా భవేయుర్వికృతాననః|

స|| ఉత్తమశాఖినాం శాఖాః ప్రశాఖస్య స్కంధశ్చ గృహ్య విపరిధావంతం దృష్ట్వా భయశంకితాః భవేయుః|| వికృతాననః రాక్షస్యః వనే విచరతః మాం మహత్ రూపం సంప్రేక్ష్య భయవిత్రస్తాః భవేత్ ||

తా|| ' మంచి కొమ్మలను మహావృక్షముల కొమ్మలనూ పట్టుకొని , చెట్లకొమ్మలమీద ఎగబ్రాకుతూ పరుగిడుతున్న నన్నుచూసి వారు భయ సందేహములు కలవారగుదురు. వికృతాననలు అగు రాక్షసులు వనములో విచరించు నా మహత్ రూపము చూచి భయపడిపోయెదరు'.

శ్లో||తతః కుర్యుస్సమాహ్వానం రాక్షస్యో రక్షసామపి||26||
రాక్షసేంద్ర నియుక్తానాం రాక్షసేంద్ర నివేశనే |
తే శూలశక్తి నిస్త్రింశ వివిధాయుధపాణయః||27||
అపతేయుర్విమర్దేsస్మిన్ వేగేనోద్విగ్నకారిణః|

స|| తతః రాక్షస్యః రాక్షసేంద్రనివేశనే రాక్షసేంద్రనియుక్తానాం రాక్షసానాం అపి సమాహ్వానం కుర్యుః|| తే తస్మిన్ విమర్దే శూలశక్తి నిస్త్రింశవివిధాయుధపాణయః ఉద్వేగకారణాత్ వేగేన ఆపతేయుః||

తా|| ' అప్పుడు రాక్షసులు రాక్షసేంద్రుని వాసములో రాక్షసేంద్రుని చే నియుక్తులైన రాక్షసులను కూడా ఆహ్వానించెదరు. అప్పుడు ఆ రాక్షసులు శూలములు శక్తులూ ఖడ్గములూ అనేక ఆయుధములు చేతిలో పట్టుకొని ఉద్వేగముతో వేగముగా వచ్చెదరు'.

శ్లో||సంరుద్ధస్తైస్తు పరితో విధమన్ రక్షసాం బలమ్||28||
శక్నుయాం నతు సంప్రాప్తం పరం పారం మహోదధేః|
మాం వా గృహ్ణీయురాప్లుత్య బహవ శ్శీఘ్రకారిణః||29||
స్యాదియం చా గృహీతార్థా మమ చ గ్రహణం భవేత్ |
హించాభిరుచయో హింస్యురిమాం వా జనకాత్మజామ్||30||
విపన్నం స్యాత్తతః కార్యం రామసుగ్రీవయోరిదమ్|

స|| తే పరితః సమృద్ధః రాక్షసానాం బలం విధమన్ మహోదధేః సంప్రాప్తుం న శక్నుయామ్||శ్శీఘ్రకారిణః బహవః ఆలుప్త్య మాం గృహ్ణీయుః వా | ఇయం చ అగృహీతార్థా స్యాత్ | మమ చ గ్రహణం భవేత్ || వా హింసాభిరుచయః ఇమాం జనకాత్మజాం హింస్త్యః | తతః రామసుగ్రీవయోః ఇదం కార్యం విపన్నం స్యాత్||

తా|| 'వారిచే చుట్టబడి వారి బలమును విరోధిస్తూ ఆ మహాసాగరము అవతలి తీరము చేరలేకపోవచ్చు. శీఘ్రముగా వెళ్ళు చాలామంది రాక్షసులు నన్ను బంధించవచ్చు. ఈమెకు సందేశము అందకపోవును. నేను కూడా బంధింపబడిన వాడగుదును. హింసలో రుచిగల వారు ఈ జనకాత్మజను హింసించెదరు. అప్పుడు రామ సుగ్రీవుల కార్యము విఫలము అగును'.

శ్లో||ఉద్దేశే నష్టమార్గేsస్మిన్ రాక్షసైః పరివారితే||31||
సాగరేణ పరిక్షిప్తే గుప్తే వసతి జానకీ|
విశస్తే నిగృహీతే వా రక్షోభిర్మయి సంయుగే||32||
నాన్యం పశ్యామి రామస్య సాహాయ్యం కార్యసాధనే|
విమృశంశ్చ న పశ్యామి యో హతే మయి వానరః||33||
శతయోజనవిస్తీర్ణం లంఘయేత మహోదధిమ్|

స||జానకీ నష్టమార్గే రాక్షసైః పరివారితే సాగరేణ పరిక్షిప్తే గుప్తే అస్మిన్ ఉద్దేశే వసతి|| మయి సంయుగే రక్షోభిః విశస్తే వా గృహీతే వా రామస్య కార్యసాధనే అన్యం సహాయం న పశ్యామి || మయి హతే యః వానరః శతయోజనవిస్తీర్ణం మహోదధిం లంఘయేత్ విమృశన్ చ న పశ్యామి ||

తా|| ' జానకి బందీగా రాక్షసుల కాపలాలో సాగరముతో చుట్టబడి రహస్యమైన ప్రదేశములో ఉన్నది. నేను రాక్షసులతో జరిగిన యుద్ధములో మరణించినా పట్టుకో బడినా రామునికి సహాయము చేయగల వారు ఎవరూ లేరు. నేను చనిపోతే ఈ శతయోజన విస్తీర్ణము గల మహా సాగరము దాటగల వానరుడు నాకు కనపడుట లేదు'.

శ్లో||కాంమం హంతుం సమర్థోsస్మి సహస్రాణ్యపి రక్షసామ్||34||
న తు శక్ష్యామి సంప్రాప్తుం పరం పారం మహోదధేః|
అసత్యాని చ యుద్ధాని సంశయో మే న రోచతే||35||
కశ్చ నిస్సంశయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞః ససంశయమ్

స|| రాక్షసాం సహస్రాణి అపి హంతుం సమర్థః అస్మి | కామం తు మహోదధేః పరం పారం సంప్రాప్తుం న శక్ష్యామి ||యుద్ధాని అసత్యాని చ సంశయః మే న రోచతే| కః ప్రజ్ఞః నిఃసంశయం కార్యం ససంశయం కుర్యాత్ |

తా|| 'వేయిమంది రాక్షసులను హతమార్చుటకు నాకు సమర్థత ఉన్నది. కాని తరువాత అ మహాసాగరపు అవతలి తీరము చేరగల శక్తి ఉండకపోవచ్చు. యుద్ధములోని అనిశ్చితాలమీద నాకు ఇష్టము లేదు. ఏ ప్రజ్ఞాశాలి సంశయముతో కూడిన కార్యము తీసుకొనును?'

శ్లో||ప్రాణత్యాగశ్చ వైదేహ్యా భవేత్ అనభిభాషణే||36||
ఏష దోషో మహాన్ హి స్యా న్మమ సీతాభిభాషణే|

స|| అనభిభాషణే వైదేహ్యా ప్రాణత్యాగశ్చ భవేత్ | సీతా అభిభాషణే ఏష మహాన్ దోషః స్యాత్ |

తా|| 'మాటలాడక పోతే వైదేహి ప్రాణత్యాగము చేయవచ్చు. సీతదేవి తో మాట్లాడినా కూడా ప్రమాదము కలుగవచ్చు.".

శ్లో||భూతా శ్చార్థా వినశ్యంతి దేశకాలవిరోధితాః||37||
విక్లబం దూతమాసాద్య తమః సూర్యోదయే యథా|
అర్థానర్థాంతరే బుద్ధిః నిశ్చితాపి న శోభతే||38||
ఘాతయంతి హి కార్యాణి దూతాం పండితమానినః|

స|| విక్లబం దూతం అసాద్య భూతాః అర్థాః దేశకాలవిరోధితాః సూర్యోదయే తమసః యథా వినశ్యంతి||అర్థాన్ అనర్థాం అంతరే బుద్ధిః నిశ్చితాపి న శోభతే | పండితమానినః దూతాః కార్యాణి ఘాతయంతి హి||

తా|| ' దేశకాల విరోధములతో వివేకహీనుడైన దూతచే అర్థవంతమైన కార్యములు సూర్యోదయముచే నాశనము చేయబడిన చీకటిలాగా నాశనము అవును. అర్థము అనర్థము మధ్యలో నిశ్చయమైన బుద్ధి కూడా శోభించదు. తమని తాము పండితులము అనుకునే దూతలు కార్యములు అనర్థము చేయుదురు'.

శ్లో||న వినశ్యేత్ కథం కార్యం వైక్లబ్యం న కథం భవేత్ ||39||
లంఘనం చ సముద్రస్య కథం ను వృథాభవేత్|
కథం ను ఖలు వాక్యం మే శృణుయాన్నో ద్విజేత వా ||40||
ఇతి సంచింత్య హనుమాంశ్చకార మతిమాన్మతిమ్|

స|| కార్యం కథం న వినశ్యేత్ | వైక్లబ్యం న కథం భవేత్ | సముద్రస్య లంఘనం కథం ను వృథాభవేత్ || మే వాక్యం కథమ్ ను శృణుయాయాత్ న ఉద్విజేత్ వా ఇతి సంచిత్య మత్మాన్ హనుమాన్ మతిం చకార||

తా|| 'కార్యము ఎట్లు చెడకుండా ఉండాలి? బుద్ధిని ఎట్లు హీనము కాకుండా చేయగలము? సముద్ర లంఘనము ఎట్లు వృధాకాకూడదు? నామాటలవలన సీత ఎట్లు భయపడకుండావుండునట్లు చేయగలను" అని అలోచించి ఈ విధముగా నిర్ణయముకు వచ్చెను.

శ్లో||రామం అక్లిష్టకర్మాణం స్వబంధు మనుకీర్తయన్||41||
నైనా ముద్వేజయిష్యామి తద్బంధుగత మానసామ్|

స|| అక్లిష్టకర్మణాం సుబంధుం రామం అనుకీర్తయన్ తద్ బంధుగతమానసాం ఏనాం న ఉద్వేజయిష్యామి||

తా|| ఎటువంటి క్లిష్టకర్మలైనా సాధించగల సమర్థుడు అగు రాముని కీర్తిస్తూ, రాముని యందే లగ్నమైన మనస్సు గల ఈమెను భయపెట్టజాలను.

శ్లో||ఇక్ష్వాకూణాం వరిష్టస్య రామస్య విదితాత్మనః||42||
శుభాని ధర్మయుక్తాని వచనాని సమర్పయన్|
శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రబ్రువన్ గిరమ్||43||
శ్రద్దాస్యతి యథా హీయం తథా సర్వం సమాదధే||44||

స|| ఇక్ష్వాకూణామ్ వరిష్ఠస్య విదితాత్మనః రామస్య శుభాని వచనాని సమర్పయన్ మధురాం గిరం ప్రబృవన్ సర్వాణి శ్రావైష్యామి | ఇయం యథా శ్రద్ధాస్యతి సర్వం సమాదదే||

తా|| 'ఇక్ష్వాకులలో వరిష్ఠుడు ఆత్మను ఎరిగినవాడు అగు రాముని కథ శుభవచనములతో మధురమైనమాటలతో వినిపించెదను. ఈ విధముగా ఆమెకు నాపట్ల విశ్వసమును పెంపొందించెదను'.

శ్లో||ఇతి స బహువిధం మహానుభావో
జగతి పతేః ప్రమదామవేక్షమాణః|
మధురమవితథం జగాద వాక్యం
ద్రుమవిటపాంతర మాస్థితో హనూమాన్||45||

స|| మహానుభావః సః హనుమాన్ ద్రుమవిటపాంతరం ఆస్థితః జగతి పతేః ప్రమదాం అవేక్షమాణః బహువిధం అవితథం మథురం వాక్యం ఇతి జగాద||

తా|| అప్పుడు మహానుభావుడైన ఆ హనుమంతుడు ఆ చెట్టుకొమ్మలమధ్యలో కూర్చుని అ జగత్పతి యొక్క భార్యని చూస్తూ మధురమైన వాక్యములతో ఈ విధముగా పలుకసాగెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే త్రింశస్సర్గః||

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముప్పదియవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||